జగిత్యాల, 2026-08-21
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 21న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈనెల 21న (శుక్రవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. మంత్రి పొంగులేటి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పర్యటనలోని ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
శంకుస్థాపన కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ధరూర్ క్యాంప్కు చేరుకుని, నూతనంగా మంజూరైన జగిత్యాల, మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. శంకుస్థాపన కార్యక్రమాలు నిర్ణీత సమయానికి సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, బారికేడింగ్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖికి అన్ని ఏర్పాట్లు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని పరిశీలించి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడనున్న నేపథ్యంలో కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, కాలనీలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారులతో మంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
సమీక్షా సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు
జగిత్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. సమీక్షా సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని మంత్రి సూచించారు. జిల్లాలో గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, లబ్ధిదారుల వివరాలు, నిర్మాణ దశలు, పెండింగ్ అంశాలు, రెవెన్యూ సమస్యలు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమగ్ర నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మంత్రి అడిగే వివరాలను వెంటనే అందించే విధంగా అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని, అసంపూర్ణ సమాచారం లేదా ఆలస్యానికి అవకాశం లేకుండా ముందస్తుగా అన్ని వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.












